తెలంగాణ ధనిక రాష్ట్రమని మొదటినుంచీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్ఘాటిస్తూ వస్తున్నారు. ఆ మాటలు మొదట్లో ఎవరూ అంతగా నమ్మకపోయినా, గత ఆర్థిక సంవత్సరంలో 17.17 శాతం వృద్ధి రేటును సాధించిందని తేలగానే అందరూ అది నిజమని నిర్ధారణకు వచ్చారు. ఈ మాటలు అక్షర సత్యాలని తాజాగా తేలింది. ఈ ఏడాది 29.97 శాతం, రాష్ట్ర సొంత వనరుల రాబడిని సమీకరించుకుని సరికొత్త రికార్డు సాధించింది. క్రితం యేడాది ఏప్రిల్ నెల ప్రారంభం నుండి నవంబర్ చివరి వరకు సొంత వనరుల ద్వారా రూ.33,995. 92 కోట్ల రాబడిని రాబట్టుకున్నది రాష్ట్రం. కాగా అదేకాలానికి 2018-19లో రూ.44,183. 55 కోట్ల రాబడిని ఆర్జించింది.రాష్ట్రం సాధించిన ఈ వృద్ధి రేటు జాతీయ సగటును కూడా అధిగమించింది.
స్థిరాస్తిరంగంలో క్రయవిక్రయాలు పుంజుకోవడం వల్ల 9,93,705 రిజిస్ట్రేషన్లు జరగడంతో రూ.3871కోట్ల రాబడి వచ్చింది. ఆబ్కారీ ఆదాయం రూ.7210 కోట్లు అందింది. రవాణా, ఇసుక రీచ్ల ద్వారా లభించిన ఆదాయం రూ.3వేల కోట్లు. జీఎస్టీ ద్వారా రూ.26 వేల కోట్లు సమకూరాయి. జీఎస్టీ అమలు, పన్ను వసూళ్ళలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం లో నిలిచింది.ఆర్ధిక క్రమశిక్షణలో అసాధారణ ప్రతిభను కనబరుస్తూ, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అద్భుతంగా ముందుకు వెళుతున్నదని కేంద్రం, నీతీ ఆయోగ్ ఎన్నోసార్లు అభినందించాయి.