సరళతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. గత ఏడాది జూలై మొదలు ఈ ఏడాది జూన్ వరకూ (2015-16) రాష్ట్రంలో అమలుచేసిన వాణిజ్య సంస్కరణల ఆధారంగా ప్రపంచ బ్యాంకు దేశీయ నిర్దేశకుడు జునైద్ అహ్మద్, నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాలతో కలసి కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ర్యాంకులను ప్రకటించారు.
కేంద్ర వాణిజ్యశాఖ పరిథిలోని పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాల విభాగం (డీఐపీపీ) నిర్దేశించిన 340 సంస్కరణలలో 98.78 శాతం అమలుచేసి తెలంగాణ రాష్ట్రం మొదటి ర్యాంకును సాధించింది. డీఐపీపీ సహకారంతో ప్రపంచబ్యాంకు సంస్కరణల అమలును సమీక్షించి ఈ ర్యాంకులను కేటాయించింది.
మొత్తం 340 సంస్కరణలలో తెలంగాణ రాష్ట్రం 324 అమలుపరిచింది. కాగా 12 అంశాలు మన రాష్ట్రానికి వర్తించవు. టి.ఎస్ ఐపాస్ రూపకల్పన, అమలుతో రాష్ట్రం స్కోరును గణనీయంగా పెంచుకోగలిగింది.
కొత్త రాష్ట్రమైన తెలంగాణ గత ఏడాది సంస్కరణల అమలులో 42.45 శాతం స్కోరుతో 13వ ర్యాంక్ సాధించగా ప్రభుత్వ దూరదృష్టి, అవలంబించిన సులభ వాణిజ్య విధానంతో ఈ ఏడాది దేశంలోనే అగ్రస్థానాన్ని సాధించింది. ఇప్పటివరకూ ఈ విషయంలో ముందున్న గుజరాత్ను కూడా అధిగమించి మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. కాగా, గత ఏడాది రెండవ స్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్ ఈ సారి మొదటి స్థానానికి చేరుకోగలిగింది. పరిశ్రమలతోపాటు, పెట్టుబడుల సాధనకు ఈ ర్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా ప్రామాణికంగా ఉండటంతో వీటికి బాగా పోటీ వుంది.
సి.ఎం అభినందనలు
సులభ వాణిజ్య విధానంలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతోషం వ్యక్తంచేశారు.ఇదే స్ఫూర్తిని, ఇదే ఒరవడిని కొనసాగించి మరింత నాణ్యమైన, సులభతరమైన సేవలందించాలని ఆయన అధికారులకు సూచించారు. వివిధ విభాగాలను పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పారదర్శకత, సింగిల్ విండే విధానం, భూమి లభ్యత, నిర్మాణ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రధాన విభాగాల్లో అనుసరిస్తున్న విధానాలకు గరిష్ట ర్యాంకులు రావడంపట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యాచరణ గొప్పగా వుండబట్టే అతి తక్కువ కాలంలోనే రాష్ట్రానికి 2550 కొత్తపరిశ్రమలు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు.
13 నుంచి ప్రథమ స్థానానికి
కొత్త రాష్ట్రం… అందునా గత ఏడాది 13వ ర్యాంకులో వున్న తెలంగాణ రాష్ట్రం ఒక్క ఏడాదిలో అంచనాలను తల్లక్రిందులుచేసి ప్రథమ స్థానం సాధించడం అంత తేలికైన పనేమీకాదు. ఇది నిజంగా ఓ అద్భుతమే. రాష్ట్రానికి టి.ఎస్ ఐపాస్ పేరిట అద్భుతమైన నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చూపిన చొరవ, దానిని అమలుచేసి, అనుకూల ఫలితాలను సాధించడంతో ఈ సాధ్యం సుసాధ్యమైంది. పరిశ్రమల శైఖ కృషితోపాటు ఇతర శాఖలన్నీ సంపూర్ణంగా సహకరించడం వల్లే సరళతర వ్యాపార నిర్వహణలో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలచిందని పరిశ్రమల శాఖా మంత్రి కె.తారక రామారావు తెలిపారు. 13వ స్థానం నుంచి ప్రధమ స్థానానికి చేరడంపై ఆయాశాఖలను ఆయన అభినందించారు.