వరంగల్ పార్లమెంట్ స్థానానికి నవంబర్ 21న జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 24న వెలువడ్డాయి. ఈ పార్లమెంట్ స్థానాన్ని అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ‘పసునూరి దయాకర్’ 4,59,092 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టుగా ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఇదే అత్యధిక మెజార్టీగా నమోదయ్యింది. అయితే దేశం మొత్తం మీద 7వ అత్యధిక మెజార్టీగా నమోదయ్యింది.
ఈ పోటీలో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి ‘పసునూరి దయాకర్’ తన ప్రత్యర్థులందరి డిపాజిట్లనుకొల్ల గొడుతూ విజయాన్ని కైవసం చేసుకున్నారు. వరంగల్ లోక్ సభ నియోజక వర్గంలో మొత్తం 15,09,671 మంది ఓటర్లు ఉండగా ఉప ఎన్నికలో 10,35,656 మంది ఓటర్లు పాల్గొని 59.42శాతం టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్కు 6,15,403 ఓట్లు వేసి గెలిపించారు. కాగా తర్వాతి రెండు స్థానాలలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ 1,56,31 ఓట్లతో రెండవ స్థానంలోనూ, బీజేపీ అభ్యర్థి దేవయ్య పగిడిపాటి 1,30,178 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అధికార పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం ప్రభుత్వ పనితీరుపై ప్రజల విశ్వాసాన్ని తెలియజేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు.