అలనాటి హరితవిప్లవ మార్గాలే ఈనాడు రైతుకు ఏ దిశా లేకుండా చేశాయాని వ్యవసాయ రంగ నిపుణులు కొందరు చెప్పే మాట. ఇక ఆధునిక వ్యవసాయం మూలంగా అటు ప్రకృతి, ఇటు మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు కలుగుతున్నదని జన సామన్యం మాట. నేల విడిచి సాము చేసే వ్యవసాయ పద్ధతులు కాకుండా సహజ పద్ధతుల్లో సాగుచేస్తేనే రైతుల బ్రతుకు ముందుకు సాగుతుందని తెలియజేప్పే హస్త భూషణమే ఈ ‘ప్రకృతి నేస్తాలు’.
పెద్దగా పెట్టుబడులు లేకుండా ప్రకృతి విధానాలతో సాగును కొనసాగిస్తున్న రైతుల విజయ గాధల పరిచయమే ఈ పుస్తక సారాంశం. ఒక్కొక్క రైతు చేసిన సేద్యపు సంగతులను వాళ్ళు అందుకున్న హానిలేని అధికదిగుబడుల గాధల కథనాలే ఈ ‘ప్రకృతి నేస్తాలు’.
రచయిత కాకి క్రాంతి కుమార్ రెడ్డి ఎంతో శ్రమించి సేకరించిన 50 మంది అభ్యుదయ రైతుల దృశ్య కథనాల అక్షర రూపమే ఈ పుస్తకం.
సుభాష్ పాలేకర్, భాస్కర్ సావె, రుడాల్ఫ్ స్టైనర్, చోహాన్ క్యూ లాంటి వారెందరో స్వతహాగా ఆచరించి బోధించిన ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తే భూమి పునీతమవుతుందని పర్యావరణం పచ్చబడుతుందనే తలంపు జన బాహుళ్యంలో ఈ మధ్య ఎక్కువయ్యింది. ప్రకృతి ప్రేమికులకు ముఖ్యంగా వ్యవసాయాన్ని ‘సుసేద్యం’ చేయాలనుకునే వారందరూ తప్పక చదివి భద్రపరుచుకోవాల్సిన పుస్తకం ఇది.
రచయిత : కాకి క్రాంతి కుమార్ రెడ్డి
ప్రతులకు : 6-2-959
దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్,
ఖైరతాబాద్, హైదరాబాద్ – 04
పేజీలు : 256
వెల : రూ. 150
– ఎం.కె.